ములకలపల్లి: అక్టోబరు 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన సెమినార్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పిలుపునిచ్చారు. ములకలపల్లిలోని రైతుసంఘం కార్యాలయంలో వర్సా శ్రీరాములు అధ్యక్షతన రైతుసంఘం ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ కరోనా కాలంలో అన్నిరంగాలు దెబ్బతిని ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పటికీ ఒక్క వ్యవసాయ రంగం మాత్రం లాభాల్లో కొనసాగిందని, వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థను పడిపోనీయకుండా కాపాడిందన్నారు.
మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయరంగంలో సంస్కరణలను ముందుకు తెచ్చిందని మండిపడ్డారు. అందులో భాగంగానే మూడు నల్లచట్టాలను తెచ్చి రైతుల నడ్డి విరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్ధతు ధర ఊసే లేకుండా చేసిందని, ఈ నేపథ్యంలో 18న కొత్తగూడెంలో భారత వ్యవసాయ రంగం-ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సెమినార్కు మండల వ్యాప్తంగా రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా నాయకులు కొండబోయిన వెంకన్న, రైతుసంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్, గోపగాని లక్ష్మినరసమ్మ, బైరు ప్రసాద్, మెట్ల రాజు, పెంకె భద్రం, కుర్సం ముత్యాలు, జోగయ్య తదితరులు పాల్గొన్నారు