జూలూరుపాడు, ఏప్రిల్ 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శవంతమైన మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. జూలూరుపాడు రైతు వేదికలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని, ఇప్పటికే గ్రామసభలు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలవుతున్నందున రైతులు ముందస్తుగా బుకింగ్ చేసుకునేలా అవగాహన కల్పించాలి. మధ్యాహ్న భోజన పథకంలో మెనూను కచ్చితంగా పాటించాలి. డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి తిరిగి బడిబాట పట్టించాలి. వేసవి దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలి.రహదారి భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో వినూత్నంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ కారణంగా కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయని సర్పంచులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన తక్షణమే స్పందించారు. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి ఆ గ్రామానికి వెంటనే సురక్షితమైన నీటిని అందించాలని ఆదేశించారు.
చేయూత వంటి పథకాల్లో అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా పర్యవేక్షణ ఉండాలని, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఏటా మోడల్ గ్రామాలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో, తమ గ్రామాలు ఆ జాబితాలో ఉండేలా పోటీతత్వంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, వివిధ శాఖల మండల అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీని ‘మోడల్ గ్రామం’గా తీర్చిదిద్దాలి : కలెక్టర్ అంకిత్