రుద్రంపూర్, ఏప్రిల్ 08 : సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని, మనుషుల మధ్య విభేదాలు మనమే సృష్టించుకున్నవేనని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజు అన్నారు. కొత్తగూడెం ప్రాంతంలోని 5 ఇంక్లైన్ గ్రూప్ మైన్స్లో నిర్వహించిన ఈద్ మిలాఫ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవుడు అందరికీ గాలి, నీరు, ఆహారం సమానంగా ఇస్తున్నాడని, కానీ మనుషులు మాత్రం మతాల పేరుతో విభేదాలు సృష్టించుకుంటున్నారన్నారు. నిజంగా దైవాన్ని నమ్మే వారు ఎప్పుడూ సాటి మనిషిని బాధ పెట్టరని, మానవత్వమే అసలైన భక్తి అని తెలిపారు. సింగరేణి కార్మికులు కుల మతాలకు అతీతంగా కలిసి పనిచేస్తూ, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, ఈ భావనపై ప్రతి కార్మికుడు గర్వపడాలని అన్నారు. “నేను మాత్రమే సుఖంగా ఉండాలి” అనే భావన కాకుండా, “మనమంతా బాగుండాలి” అనే ఆలోచనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే, మనకు అన్నం పెట్టే సింగరేణి సంస్థను నిబద్ధతతో పనిచేసి కాపాడుకోవాలని సూచించారు.
ముస్లిం మత పెద్ద షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదిన విశిష్టతను వివరించారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పొరుగువారితో సత్సంబంధాలు, మానవతా విలువలు పాటించడం ద్వారానే నిజమైన భక్తి సాధ్యమవుతుందని చెప్పారు. గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ నీతి, నిజాయితీతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా ఒక విధమైన భక్తి అన్నారు. అన్ని మతాల పండుగలను పరస్పరం గౌరవించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ముస్లిం కార్మికులు అందరికీ తియ్యని షీర్ కుర్మా (సేమీయాలు) పంచి మత సామరస్యాన్ని చాటుకున్నారు. మిలాద్ కార్యక్రమానికి బాధ్యత వహిస్తూ అందరిని కలుపుకుని ఈ కార్యక్రమంను విజయవంతం చేయడంలో అంకిత భావం కనబరిచిన హుమాయున్ కృషిని మరిచిపోలేమని పేర్కొంటూ అన్ని యూనియన్లకు సంబంధించిన నాయకులు, గని మేనేజర్ శ్యాం ప్రసాద్ వెల్ఫేర్ ఆఫీసర్ షకిల్ సమక్షంలో శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గని వెల్ఫేర్ ఆఫీసర్ షకీల్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ముఖ్య అతిథి బాసిత్, హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రెటరీ ఆసిఫ్, కుమార్, చిలక రాజయ్య, బుక్య రమేశ్, రఫీ, మొహమ్మద్ ఉమర్ ఫారూఖ్, గౌసుద్దీన్, షకీల్, ఖాజా పాషా, జిలానీ, శంషుద్దీన్, రబ్బాని, సావీర్, తాజుద్దీన్, శంషుద్దీన్, ఇతర అధికారులు, కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సింగరేణిలో ఘనంగా ఈద్ మిలాఫ్ వేడుకలు