చుంచుపల్లి, జూన్ 23 : చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టి విద్యార్థుల చేరికలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బాదావత్ అనిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బడి ఈడు ఉన్న ప్రతి చిన్నారి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్లు వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. బడి ఈడు ఉన్న పిల్లలందరూ పాఠశాలలో చేరేలా గ్రామ స్థాయిలో సహకరిస్తామని, పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె.బాలు, ఉప సర్పంచ్ పులిచర్ల వెంకటేశ్వరరావు, చైర్మన్ నర్సింహారావు, గ్రామ పెద్దలు విశ్వనాథం, చెన్నారావు, ముత్యాలరావు, జానకి, భవాని, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.