భద్రాచలం, ఫిబ్రవరి 4 : భారతీయ జనతా పార్టీకి భద్రాద్రిపై చిత్తశుద్ధి ఉందా? అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాంప్రసాద్ తొలుత ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బల్లా సాయికుమార్కు పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం నుంచి ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయకపోతే భాజపా ప్రభుత్వ పెద్దలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను ప్రజా ఉద్యమంగా మారుస్తామని, అన్ని రాజకీయ పార్టీలు, భద్రాద్రి ప్రజలను ఐక్యం చేసి కేంద్రానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఏపీలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్త పట్నం, గుండాల పంచాయతీలను భద్రాచలంలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి అవుతుందన్నారు. ఈ విషయంపై టీఆఎర్ఎస్ నాయకులు బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన వారిలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్, సీపీఐ నాయకులు కల్లూరి శ్రీరాములు, ఎస్వీఎస్ నాయుడు, త్రిమూర్తులు, కేవీఆర్, లంకపల్లి విశ్వనాథ్, సీహెచ్ అనీల్, మాలమహనాడు నాయకులు పౌల్రాజ్ ఉన్నారు.