జూలూరుపాడు : జూలురుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణాలతో పట్టణాన్ని తలపించేలా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ డీఎంఎఫ్టీ నిధుల ద్వారా రూ.5.22 కోట్లు మంజూరు చేశారు. మండల కేంద్రంలో మంగళవారం రహదారుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ నిర్మాణపనులను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..వచ్చే నెలలో పనులు ప్రారంభించడానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు. డివైడర్ల మధ్యలో విద్యుత్తు ఫోల్స్ తో పాటు పూల మొక్కలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ఆపద్బందు పథకం ద్వారా ఆర్ధికసాయం అందించడానికి ప్రతిపాదనలు పంపాలని తహసీల్ధార్ని ఆదేశించారు. వీరి వెంట రోడ్లు, భవనాల శాఖ ఈఈ మండల ప్రత్యేకాధికారి భీంలా, డీఈ నాగేశ్వరరావు, తహసీల్ధార్ విల్సన్ సర్పంచ్ సావిత్రి కార్యదర్శి అనంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.