– నా ఏరియాలో నా అనుమతి లేకుండా కార్యక్రమాలు చేస్తే సహించేది లేదంటూ హెచ్చరిక
చుంచుపల్లి, ఆగస్టు 31 : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకు వినియోగించే నీటిలో బల్లి పడిన ఘటనను నిరసిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి ఎస్కే ఫైవ్ దాదాపై అలాగే 27వ డివిజన్ కార్పొరేటర్ మధ్యల హరితపై సీపీఐ నాయకుడు దుర్గరాశి వెంకన్న దౌర్జన్యం చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఘటనపై నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్ నాయకులను అక్కడి నుండి వెళ్లిపోవాలని వెంకన్న బలవంతం చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు. అంతేకాకుండా “నా ఏరియాలో నా అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే సహించేది లేదు” మీ పదవులను కూడా పీకిచ్చేస్తా అంటూ హెచ్చరించినట్లు చెప్పారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఏఐవైఎఫ్ నాయకులు ప్రశ్నించారు.
విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ఎవరూ అడ్డుకోరాదని వారు పేర్కొన్నారు.
కాగా, ఈ విషయాన్ని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.కె ఫైయిం దాదా మాట్లాడుతూ.. తమపై చేసిన దౌర్జన్యంను తమ రాష్ట్ర అధ్యక్షుడు వలీల్లా కాత్రేయ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేందర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో తన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, ఏఐవైఎఫ్ నాయకులపై అదేవిధంగా కార్పొరేటర్ పై సిపిఐ నాయకుడు దుర్గరాసి వెంకన్న దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. పాఠశాలలో జరిగిన ఘటన అదే సమయంలో నిరసనకారులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.