భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్ సంబంధిత ప్రశ్నలపై ప్రజలకు సహాయపడేందుకు కంట్రోల్ కూం ఏర్పాటుతో పాటు ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. జిల్లా, మండలస్థాయి అధికారులతో జిల్లాలోని కొవిడ్ పరిస్థితిని కలెక్టర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కొవిడ్ -19 చికిత్సను అందించే 22 ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు సీనియర్ డాక్టర్ సుజాతను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు ఆయన తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపై రోజువారీ నివేదికలు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. సుమారు 10 శాతం కేసులకు ఇన్పేషెంట్ సేవలు అవసరమవుతున్నందున ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సంరక్షణను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలన్నారు.
జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం హెల్ప్లైన్ నంబర్ 08744-241950 ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరొకటి (08744-246655) జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించి ఏదైనా సహాయం లేదా మార్గదర్శకత్వం అవసరమైతే ప్రజలు పై నంబర్లకు కాల్ చేయొచ్చన్నారు.