భద్రాచలం, మార్చి 24 : కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తమ అభివృద్ధిగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నేత రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు మూడు రంగుల జెండా కలర్లు వేసి తమ ప్రభుత్వంలో ఇచ్చాము తామే కట్టాం అని గొప్పలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో భద్రాచలం పట్టణ ప్రజలకు డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం నిధులు కేటాయించి నిర్మించింది. దాన్ని కూడా ప్రారంభించి తామే చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 15 నెలల కాలంలో కాంగ్రెస్ భద్రాచలం పట్టణాభివృద్ధికి శాశ్వత పరిష్కారం ఏమి చూపిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నియోజవర్గ ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామంలో వంతెన కూలి ఇప్పటికే ఏడుగురు మరణించారని, వెంకటాపురం మండలంలో ఇసుక లారీల లోడు తట్టుకోలేక మరో వంతెన కూలిపోయిందన్నారు. కనీసం నూతన వంతెనల నిర్మాణానికి అధికార ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, డైవర్షన్ రోడ్లు వేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రూ.38 కోట్లతో కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే పనులు మధ్యలోనే ఆగిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్ట మీద కనీసం ఒక రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేదన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు, వేసిన రోడ్లు తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని ఏద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తగ్గించి ప్రజల సమస్యలపై దృష్టిసారించి పరిష్కారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, పార్టీ సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమకుమార్, దుమ్ముగూడెం మండల నాయకులు బోల్లి వెంకటరావు, కాలువ పూర్ణయ్య, కొత్త మల్లేశ్, భక్తుల నరసింహులు, అంబటి కర్ర కృష్ణ, నాగేశ్వరరావు, మొరాల డానియల్, ప్రదీప్, ఖాదర్, కొలిపాక శివ,మోహన్ రావు పాల్గొన్నారు.