న్యూఢిల్లీ: అమెరికాలో చదువు పూర్తిచేసుకుని, అక్కడే ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్'(ఓపీటీ) వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లు(సుమారు రూ. ఒక కోటి)ఫీజు విధించే అంశాన్ని ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలు భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, అమెరికాలో ఉన్న సుమారు రూ.3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది. హెచ్-1వీ వీసాలపై ఇలాంటి ఫీజును విధించేందుకు గతంలో తెచ్చిన ప్రతిపాదనను ఒక అమెరికా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇప్పుడు ఓపీటీ కార్యక్రమంపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలో ఉన్నది.
భారీ ఫీజు చట్టరూపం దాలిస్తే తాము చెల్లించలేమని పలువురు భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో డేటా సైన్స్ అభ్యసిస్తున్న కేరళకు చెందిన ఒక పీహెచ్డీ విద్యార్థి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ తర్వాత అనుభవం సంపాదించేందుకు ఓపీటీ అత్యంత కీలకమని, అయితే లక్ష డాలర్లు చెల్లించడం తనలాంటి చాలామంది విద్యార్థులకు అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైవు ఉద్యోగుల తరపున కంపెనీలు ఈ ఫీజు చెల్లించేందుకు అనుమతించినప్పటికీ, పలు సంస్థలు ఇందుకు ముందుకు రాకపోవచ్చని నిపుణలు భావిస్తున్నారు.