జూలూరుపాడు, ఏప్రిల్ 15 : గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు మంగళవారం తెలిపారు. ధర్నా కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అలాగే పంచాయతీ కార్మికులకు ఉరితాడుగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
జీఓ నంబర్ 60 ప్రకారం రూ.15,000 /- , 19,500/- , 22,750/- చొప్పున గ్రామ పంచాయతీ వర్కర్లకు ఇవ్వాలన్నారు. మల్టీ పర్పస్ జీఓ 51ని రద్దు చేసి, గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు. సాధారణ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా నెల నెలా వేతనాలు వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 17 జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.