భద్రాచలం, సెప్టెంబరు 05 : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాచలంలో శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు, యువజన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని విమర్శించారు. విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే జీవో నంబర్ 97ను వెంటనే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ ఎస్ వీ నాయకులు హెచ్చరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు యువరాజు, బీఆర్ ఎస్ వీ కార్యకర్తలు, విద్యార్థులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.