– రాత్రి నుండి నిలిచిన రాకపోకలు
– పాత బ్రిడ్జిపై మీదుగా వాహనాల మళ్లింపు
– నిర్మాణ లోపమా, సాంకేతిక వైఫల్యమా?
బూర్గంపహాడ్, మే 08 : భద్రాచలం- సారపాక మధ్య గోదావరి నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన (కొత్త) వారధి వద్ద భారీ ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. సారపాక వద్ద కొత్త వంతెనకు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోవడంతో అధికారులు అప్రమత్తమై కొత్త వారధిపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మట్టి పక్కకు జారిపోవడాన్ని గమనించిన ప్రయాణీకులు భయాందోళనకు గురై రోడ్డు కుంగిన సమాచారం అధికారులకు తెలపడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రమాద తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తతో వాహనాల రాకపోకలను కొత్త వారధిపై నిలిపివేసి పాత వంతెన మీదుగా మళ్లించారు. అయితే పాత బ్రిడ్జి కావడంతో పాటు పెద్ద పెద్ద వాహనాలు సైతం పాత వారధి మీదుగా వెళ్తుండడంతో ప్రయాణీకులు, వాహనదారులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
కొత్త వారధి వద్ద అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో సంబంధిత శాఖ అధికారులు నిర్మాణ లోపాలపై దృష్టి సారించారు. అయితే బ్రిడ్జి కింద అప్రోచ్ కొట్టుకుపోవడానికి ఏమైనా సాంకేతిక కారణాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణీకులు, వాహనదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వాహన రాకపోకలను ఈ వంతెనపై నిలిపివేసినప్పటికీ ఎన్నో కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కొద్దికాలానికే ఇలా అప్రోచ్ కొట్టుకుపోవడం పట్ల పలువురు నేషనల్ హైవే అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు.
అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిన సమయంలో అధికారులు అప్రమత్తమై మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఇప్పటికే ఎడమవైపు అప్రోచ్ రోడ్డుకు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా కుడి వైపున అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంపై పలువురు వాహనదారులు నూతన వారధి నిర్మాణ పనులపై మండిపడుతున్నారు. ఈ విషయమై నేషనల్ హైవే డీఈ శైలజను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.

భద్రాచలం- సారపాక : నూతన బ్రిడ్జి వద్ద కుంగిన అప్రోచ్ రోడ్