అశ్వారావుపేట: ఆయిల్పాం సాగుతోనే రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ స్పష్టం చేశారు. అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. జోగులాంబ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన 120 మంది రైతులతో పాటు 60 మంది వ్యవసాయశాఖాధికారులు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. ముందుగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం, పాకలగూడెం గ్రామాల సమీపంలో ఆయిల్పాం తోటలను సందర్శించారు.
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లిలో పర్యటించారు. అక్కడ నుంచి అప్పారావుపేట ఫ్యాక్టరీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయిల్ఫెడ్ అధికారులు ఆయిల్పాం సాగు పద్దతులు, నిర్వాహణ, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పంట దిగుబడి, సేకరణ, మార్కెటింగ్, ఫ్యాక్టరీకి గెలల తరలింపు, ఫ్యాక్టరీలో గెలల క్రసింగ్, ఆయిల్ రికవరీ, ఉప ఉత్పత్తుల సేకరణ, విక్రయం,గెలల ధర నిర్ణయం వంటి అంశాలను వివరించారు. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ మొక్కల నర్సరీలో పర్యటించారు. మొక్కల ఉత్పత్తి, విత్తన దిగుమతి, మొక్కల సబ్సీడీ వివరాలను తెలిపారు.
ఆయిల్పాం సాగుకు ఉజ్వల భవిష్యత్ ఉందని, పంట విక్రయానికి ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పారు. రైతుల నుంచి పంట గెలలను ఆయిల్ఫెడ్ సంస్థ సేకరిస్తుందని, ఇందుకు రవాణా చార్జీలను కూడా చెల్లిస్తుందని, దళారీ వ్యవస్థ ఉండదని వివరించారు. మొక్కల పంపిణీ, డ్రిప్కు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు అందిస్తుందని, 4 ఏండ్ల పాటు ఎకరాకు రూ.20 వేల విలువైన ఎరువులను ఉచితంగా ఆయిల్ఫెడ్ అందిస్తుందని అన్నారు.
దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కోంటుందని, అంతర పంటల సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందని తెలిపారు. ఆయిల్పాం సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించే రైతుబంధు కూడా ఆయిల్పామ్ తోటలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ క్షేత్ర సిబ్బంది ప్రవీణ్కుమార్, సతీష్, ఫణికుమార్, కృష్ణారావు, యశస్వీ పాల్గొన్నారు.