భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 14 : ఇబ్బందులు, అవమానాలను ఆయుధంగా మలచుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయ్యారని, బడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ సంక్షేమ శాఖ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు సోమవారం నిర్వహించిన వేడుకలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. అబేద్కర్ చిత్రపటానికి పూల లలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఎవరికి ఎవరు తక్కువ కాదని సమతావాదాన్ని చాటి చెప్పిన మహా మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సిన అన్ని హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు.
అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వాడు కాదని, అందరి వాడన్నారు. అంబేద్కర్ జయంతి మనందరికి పెద్ద పండుగ అన్నారు. మహానీయుల సిద్దాంతాలు నేటి తరాల వారు తెలుసుకోవాలన్నారు. అంబేద్కర్ ఆధునిక ప్రపంచానికి మార్గ నిర్దేశం చేశారన్నారు. సామాజిక రుగ్మతలను అనుభవించి భావితరాల భవిష్యత్కు రుగ్మతలు అడ్డుకారాదని హక్కులు కల్పించిన మహనీయుడన్నారు. చదువే మార్పునకు మూలమని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అనసూర్య, హనుమంతరావు, ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యుడు మారపాక రమేశ్, కో కన్వీనర్లు కొప్పరి నవతన్ కుమార్, వేమూరి లక్ష్మిబాయ్, సంభారపు నాగేందర్, కనుకుంట్ల నిర్మల, మెదని లక్ష్మీబాయి, ఎంట్రీ భార్గవి, కూరపాటి రవీందర్, కమిటీ మెంబర్లు బడిలక పుష్పలత, సిరిమల్లె కుమారస్వామి, కర్ష రత్నకుమారి, రెంటపల్లి మాధవి, గంధం కల్పన, మద్దెల సాయి సుధీర్, కొచ్చర్ల కమలా రాణి, సొల్లు రవి కిరణ్, దాసరి శ్రీనివాస్, బొమ్మెర శ్రీనివాస్, బొంకూరి పరమేశ్, మోదుగు జోగారావు, సిరిగిరి మురళి, కొప్పుల సంజయ్ మహారాజ్, పాలెపు దుర్గేశ్, కుంపటి నాగరాజు పాల్గొన్నారు.
Bhadradri Kothagudem : బడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ : కలెక్టర్ జితేష్ వి. పాటిల్