రామవరం, ఆగస్టు 23 : బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ అయిన న్యాయవాదులు అందరికి వెంటనే హెల్త్ కార్డులు అందజేయాలని ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ జనపరెడ్డి గోపికృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఐ.ఎల్.పి.ఏ జిల్లా కార్యాలయంలో అడ్వకేట్ యర్రపాటి కృష్ణ అధ్యక్షతన జరిగిన క్రియాశీలక సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న హెల్త్ కార్డులు 2019 తర్వాత ఎన్రోల్ అయిన న్యాయవాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేయడం లేదదన్నారు. తద్వారా గత ఆరు సంవత్సరాలుగా కొత్తగా ఎన్రోల్ అయిన న్యాయవాదులకు హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని వెంటనే సమస్య పరిష్కారించాలన్నారు.
ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో న్యాయవాదుల అభివృద్ధి కోసం, అందరు న్యాయవాదులకు అన్ని రంగాల్లో సమాన హక్కులు రావడం కోసం పని చేస్తుందన్నారు. పూలే, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ఐ.ఎల్.పి.ఏ లో యువ న్యాయవాదులు చేరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ వారంలో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎల్.పి.ఏ భాథ్యులు అంబటి రమేశ్, డి.సామంత్, మహమ్మద్ సాదిక్ పాషా, ఎస్.భానుప్రియ, మారపాక రమేశ్, కాకాటి నీలివేణి, నందిని, అంకుశ్ పాషా, థరావత్ రాధాకృష్ణా, బేబి షామిలి పాల్గొన్నారు.