– సమ్మె నోటీసుపై కీలక పురోగతి
– ఈ నెల 15న ఆర్ఎల్సీ సమక్షంలో మరోసారి చర్చలు
– పివికే5, ఆర్ సి హెచ్ పి నందు గేట్ మీటింగ్స్ లో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ వెల్లడి
రుద్రంపూర్, జూలై 10 : తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఏఐటీయూసీనేనని అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని పివికే5, ఆర్ సి హెచ్ పి నందు నిర్వహించిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ 2013లోనే సచివాలయాన్ని ముట్టడించి అరెస్టులకు గురైన ఘనత ఏఐటీయూసీదేనని అన్నారు. ప్రస్తుతం తాడిచర్ల-2 బ్లాక్తో పాటు మిగిలిన బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల ఉపాధి భద్రత కోసం ఇది అవసరమన్నారు. సమ్మె నోటీసుకు సంబంధించి కీలక పురోగతి చోటుచేసుకుందని, ఈ నెల 15న రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని తెలిపారు. చర్చలు విఫలమై ఆర్ఎల్సీ ఫెయిల్యూర్ రిపోర్ట్ జారీ చేస్తే ఆగస్టులో సమ్మెకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను ప్రతి కార్మికుడికి 40 శాతం వాటా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెర్క్స్పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.56 వేల కోట్లు వసూలు చేసి సంస్థకు నూతన ప్రాజెక్టులను తీసుకొచ్చి సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను వారి కుటుంబ ఆవేదనలను అసెంబ్లీలో నిరంతరం ప్రస్తావించిన ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాత్రమేనని అన్నారు. ఈ గేట్ మీటింగ్స్ లో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్ ఎస్.నాగేశ్వరరావు, హుమాయూన్, కర్రు రమేష్, హీరాలాల్, పీట్ కార్యదర్శులు భూక్యా రమేష్, కమల్, మధు కృష్ణ, నాయకులు సాయిపవన్, రామచందర్, శశివర్ధనరెడ్డి, సురేందర్ రెడ్డి, మెంగన్ రవి, కోటి, సైదులు, వెంకటరమణ, కుమార్ రావు పాల్గొన్నారు.

‘తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఏఐటీయూసీనే’