ఇల్లెందు, జూన్ 14 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి నోటీసుల పేరుతో కుయుక్తులు పన్నుతుందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఏసీబీ అధికారులు గతంలో ఒకసారి కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించి ఏమీ తేల్చలేకపోయిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. ఫార్ములా-ఈ రేస్ సజావుగా సాగిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగకున్నా, అవినీతి చోటుచేసుకోకున్నా కేటీఆర్ను విచారించడం చట్ట వ్యతిరేకమన్నారు.
ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ..హైదరాబాద్లో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నగరానికి పేరు, ఖ్యాతి లభించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి దోహదపడిందన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై అధికార పక్షం అక్రమ కేసులు బనాయిస్తూ, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడడాన్ని ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కుట్రలు, కుయుక్తులకు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోరని ఆయన పేర్కొన్నారు.