జూలూరుపాడు, మే 18 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన జూలూరుపాడులో నిర్వహించిన టూ కే రన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతమైంది. జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగును ఎంపీడీఓతో కలిసి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రన్ బస్టాండ్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ పరుగులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు స్థానిక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహ పరిచారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎస్ఐ బాదావత్ రవి మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని తెలిపారు. టూ కే రన్ వంటి సమిష్టి కార్యక్రమాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య మెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రన్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి తులసీరామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జూలూరుపాడులో ఘనంగా ‘టూ కే రన్’