భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సమష్టి కృషితో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం క్లబ్లో డీఎంహెచ్వో డాక్టర్ శిరీష అధ్యక్షతన గురువారం నిర్వహించిన కంటి వెలుగు సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానవ శరీరంలో అన్ని అవయవాలకంటే కన్ను చాలా సున్నితమైనదని, కంటిచూపు లేకపోతే జీవితమంతా అంధకారంగా ఉంటుందని అన్నారు. కంటికి అంతటి ప్రాముఖ్యత ఉన్నందునే సీఎం కేసీఆర్ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని మనమంతా అదృష్టంగా భావించాలని అన్నారు. 2018లో మొదట విడత కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్.. లక్షల మందికి కళ్ల పరీక్షలు చేయించారని, సమస్య ఉన్న వారికి కళ్ల అద్దాలు అందించారని, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారని వివరించారు. రెండో విడుతలో భాగంగా ఈ నెల 18 నుంచి జూన్ 20 వరకు వంద రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 18 ఏళ్లు నిండిని ప్రతి ఒక్కరూ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చునని అన్నా రు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డులో నమోదవుతుందని అన్నారు. భద్రాద్రి జిల్లాలోని పంచాయతీలు, వార్డులో 585 క్యాంపులు నిర్వహించనున్నట్లు వివరించారు. కంటి వెలుగు కార్యక్రమ విజయవంతానికి అధికారులు విస్తృత ప్రచారం చేయాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు.
కలెక్టర్కు అభినందనలు..
కొత్త జిల్లా అయిన భద్రాద్రిని మంచి టీం వర్కుతో దేశంలో సముచిత స్థానంలో నిలిపిన కలెక్టర్ అనుదీప్ అభినందనీయుడని అన్నారు. పిన్న వయస్సులో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి కరోనా, గోదావరి వరదలు, శ్రీరామనవమి, రాష్ట్రపతి పర్యటన, ముక్కోటి ఉత్సవాలను సక్సెస్ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతులు మీదుగా నూతన కలెక్టరేట్ను ప్రారంభించుకోబోతున్నామన్నారు.
దేశానికి దిక్సూచి కంటి వెలుగు: ప్రజాప్రతినిధులు..
కంటి వెలుగు కార్యక్రమం దేశానికి దిక్సూచి లాంటిదని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రప్రభుత్వమూ అమలు చేయడం లేదని గుర్తుచేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని రెండో విడతలోనూ చేపట్టడం వల్ల మరింత మంది వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరికీ రాని ఆలోచన ఇదని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమ విజయవంతానికి జిల్లాలో 48 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సందేహాల నివృత్తి కోసం 08744 246655 నెంబరుతో కంట్రోల్ రూమును సైతం అందుబాటులో ఉంచామన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్షి, డీ.వెంకటేశ్వర్లు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు పాల్గొన్నారు. అనంతరం కంటి వెలుగు ఆపరేటర్లకు ట్యాబ్లు అందజేశారు.
పాల్వంచలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
పాల్వంచ రూరల్, జనవరి 5: అన్ని వర్గాల ప్రజలకూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిండచంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పాల్వంచలోని కిన్నెరసాని రోడ్డులో రూ.5.45 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, డివైడర్ నిర్మాణం, బస్టాండ్ ఆధునీకరణ పనుల శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కొత్తగూడెం నుంచి పాల్వంచ వరకు ఉన్న పొడవైన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత ఇక్కడే ఉందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మరో రూ.వంద కోట్లతో నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ నూతన సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.