కల్లూరు :క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ సూపర్వైజర్ వై.సురేష్ అన్నారు. మంగళవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని కృష్ణయ్యబంజరలో టీబీవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీబీ నియంత్రణ అధికారి సుబ్బారావు ఆదేశాల మేరకు గ్రామాల్లో టీబీ వ్యాధి గురించి ఇంటింటి సర్వే నిర్వహించి 2025 కల్లా టీబీ నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
రెండు వారాలకు మించి దగ్గు, కళ్లేరావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, తరచూ జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని పీహెచ్సీలో కళ్లే నమూనాలు ఇచ్చినట్లయితే టీహబ్ వెహికల్ ద్వారా ఖమ్మంలో సిబీనాట్ మిషన్లో పరీక్షలు చేసి వారు ఇచ్చిన మొబైల్నెంబర్కు పరీక్షా ఫలితాలు పంపించడం జరుగుతుందన్నారు. టీబీ వ్యాధికి సంబంధించిన పరీక్షలు, మందులు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ పర్సన్ రామారావు, లాబ్ సూపర్వైజర్ సంజీవకుమార్, ఆశా రాణి, సిబ్బంది పాల్గొన్నారు.