కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 21: సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారులతో పోలీస్ హెడ్క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని విధులు నిర్వర్తించాలని, పోలీసులు ఉన్నారనే ధైర్యాన్ని ప్రజలకు మరింత పెంపొందించాలని అన్నారు. నిత్యం కొత్త కోణాల్లో జరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోక్సో కేసు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు సతీష్కుమార్, వెంకన్నబాబు, రవీందర్రెడ్డి, మల్లయ్యస్వామి, అశోక్కుమార్, సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.