ఖమ్మం, నవంబర్27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచారం ముగిసింది. ఎన్నికల బహిరంగ ఫలితాలు ముగియడంతో అభ్యర్ధులు ఉన్న కొద్ది సమయంలోనే ఓటర్లను కలిసి ఓటు అభ్యర్ధించేందుకు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం సాయత్రం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఎక్కడికక్కడే ప్రచారాన్ని ముగించి వెనుదిరిగారు. సెప్టెంబర్ 21న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించగా ఆ తర్వాతి రోజు నుంచే గులాబీ ప్రచార పర్వం ప్రారంభమైంది. అక్టోబర్ 9న ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశాక ప్రచారం ఊపందుకున్నది. నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల ప్రక్రియ సాగింది. 15న ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. 16 నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రచార మాత ప్రారంభించారు.
బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తర్వాత గులాబీ శ్రేణులు పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. మంగళవారం ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్థి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు, నగర మేయర్ పునకొల్లు నీరజ రోడ్ షో నిర్వహించారు. పువ్వాడ తరఫున ఎన్నికల ప్రచారంలో కుమారుడు నయన్రాజు, సతీమణి వసంతలక్ష్మి, మమత మెడికల్ కళాశాల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ, ఆమె కుమారుడు నరేన్ ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధిరలో అభ్యర్థి లింగాల కమల్రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రచారం నిర్వహించారు.