హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్నగర్లో సమరభేరి మోగించగా, తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 10గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానుండగా, అణచివేత, దమనకాండకు వ్యతిరేకంగా మోదీ సర్కార్పై నిరసన గళమెత్తనున్నారు. ఈ మేరకు విద్యార్థులు ఉప్పెనలా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
విద్యార్థులకు అండగా కేటీఆర్
తన 50వ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న కేటీఆర్ విద్యార్థి ఉద్యమానికి అండగా నిలువనున్నారు. హైదరాబాద్ వేదికగా తలపెట్టిన నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని సంకల్పించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటనున్నారు. నాడు ఓట్ల కోసం యువతకు అలవిగాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత పాలకులు చేస్తున్న మోసాలను ఎండగట్టనున్నారు. తప్పుడు వాగ్దానాలిచ్చిన ప్రభుత్వాల మెడలు వంచే దిశగా కార్యోన్ముఖులను చేయనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం చేపట్టనున్న కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణలో తీసుకువచ్చే సంస్కరణలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
కదిలిరానున్న యువతరం
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగులు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమం తప్పకుండా విజయవంతమవుతుందని నేతలు ధీమా వ్యక్తంచేశారు. పోలీసులు సైతం అడ్డుకోకుండా నిరసనకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.