కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 16: పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా 75 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 13,435 మంది విద్యార్థులు హాజరవుతారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు సీసీ కెమేరాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, మన ఊరు/మన బస్తీ-మన బడిపై సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, డీఈవోలు, పోలీస్ అధికారులతో విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ(పీఎస్) సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ దేవసేన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. 75 సిట్టింగ్, ఐదు ఫ్లైయింగ్ స్కాడ్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రహరీ లేని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట నియంత్రణ చర్యల్లో భాగంగా బయటి ప్రాంతం కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 38 అంశాలతో కూడిన చెక్లిస్టును ప్రభుత్వానికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించామన్నారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్లు ప్రతి రోజూ తనిఖీ చేసేలా ఆదేశించినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈవో సోమశేఖరశర్మ, డీపీవో రమాకాంత్, డీఎంహెచ్వో డాక్టర్ దయానందస్వామి, అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు పాల్గొన్నారు.