ఖమ్మం, మార్చి 27 : జిల్లాలో ఈ యాసంగిలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో ఈ యాసంగిలో 41,477 హెక్టార్లలో అన్నదాతలు వరి పంటను సాగు చేశారు. ఇందులో హెక్టార్కు 6.180 మెట్రిక్ టన్నుల చొప్పున దిగుబడి వస్తుందని, తద్వారా జిల్లాలో మొత్తం వరి దిగుబడి 2,56,328 మెట్రిక్ టన్నులు ఉంటుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిలో స్థానిక ప్రజల అవసరాలకు 25,632 మెట్రిక్ టన్నులు పోగా.. 2,30,808 మెట్రిక్ టన్నుల ధాన్యం మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దీనిలో మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసేవి, స్థానిక అవసరాలకు వినియోగించేవి, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసేవి పోగా.. మిగిలిన 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేయనున్న 223 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
అయితే యాసంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్న 223 కొనుగోలు కేంద్రాల్లో డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 41, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 152, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 30 కేంద్రాలు ఉండనున్నాయి. 30 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా.. కోటి గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి వసతి, కరెంట్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేళ్లు, మాయిశ్చరైజ్ మీటర్లు తదితర వాటిని ముందస్తుగానే ఏర్పాటు చేయనున్నారు. మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం వరి ధాన్యానికి క్వింటాకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 మద్దతు ధర అందించనుంది. అలాగే, ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూలై ఆఖరు వరకు కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించనున్నారు. రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేయిస్తే నూకల శాతం అధికంగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా వరి ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
ఖమ్మం, మార్చి 27 : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన గడువులోగా సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని, లేదంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పకా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో మొత్తం 223 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 152, ఐకేపీ 42, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 30 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులతోపాటు టార్పాలిన్, ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచులు, వేయింగ్ మిషన్ వంటి సౌర్యాలు కల్పించాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు రాజకీయ నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యవసాయ, ఐకేపీ, సహకార శాఖ, హార్టికల్చర్ సంబంధిత శాఖల అధికారులు బృందంగా ఏర్పడి కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. సమీక్షా సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్, జిల్లా సహకార అధికారి మురళీధర్రావు, డీఎం సివిల్ సైప్లె శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.