కవాడిగూడ, ఆగస్టు 7 : రాష్ట్రంలోని పెన్షనర్లకు గత మూడేండ్ల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో నగదు రహిత వైద్యసేవలు అందించాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద జేఏసీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంతోపాటు ఫిట్మెంట్తో కలిపి పీఆర్సీ, డీఏ చెల్లిస్తామన్న హామీని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ఆలిండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డీ సుధాకర్, మాజీ సెక్రటరీ జనరల్ పూర్ణచందర్రావు, ఫైనాన్స్ సెక్రటరీ రాజేంద్రబాబు, జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.