కొవిడ్ మహమ్మారి జన జీవితాలను అతలాకుతలం చేసింది.. ఈ ప్రభావం విద్యావ్యవస్థపైనా పడింది. విద్యార్థులను ప్రత్యక్ష తరగతులకు దూరం చేసింది.. ‘పది’ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రెండు విద్యా సంవత్సరాల్లో రాయలేకపోయారు. అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర విద్యాశాఖ పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది.. కొవిడ్ ప్రభావం లేకపోవడంతో ఈసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.. సోమవారం నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చారు.. నిమిషం అలస్యం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు పరీక్షా సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది..
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 21: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రెండేళ్ల తర్వాత తిరిగి జరుగుతున్నాయి. 2019-20 విద్యాసంవత్సరంలో ఇక పదో తరగతి పరీక్షలు మొదలవుతాయనగా కొవిడ్ విపత్తు వచ్చింది. దీంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలోనూ ఇదే విధంగా కొవిడ్ సెకండ్ వేవ్ వచ్చి మరోసారి పరీక్షలు రద్దయ్యాయి. ఈ విద్యాసంవత్సరంలో కొవిడ్ ఇబ్బందులు లేకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ పబ్లిక్ పరీక్షలు నిర్వహించవచ్చని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం (23వ తేదీ) నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల ప్రారంభానికి ఇక కేవలం 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. ఖమ్మం జిల్లాలో 104 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా 17,623 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 8,932 మంది, బాలికలు 8,691 మంది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా 13,435 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 6,426 మంది, బాలికలు 6,908 మంది, వన్స్ ఫెయిల్ అయిన విద్యార్థులు 91 మంది.
ఆరు పేపర్లు మాత్రమే..
గతంలో పదోతరగతి విద్యార్థులు 11 పేపర్లు రాసేవారు. విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రవిద్యాశాఖ వాటిని ఆరు పేపర్లుగా కుదించింది. పేపర్లు తగ్గడంతో విద్యార్థులు సునాయాసంగా పరీక్షలు రాసే అవకాశం ఉంది. గతంలో పరీక్షా సమయాన్ని అరగంట పెంచి మూడు గంటల పదిహేను నిమిషాలకు పెంచారు. ఇప్పటికే విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలూ రాశారు. ఈ చొప్పున విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమైనట్లే.
నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
పదో తరగతి పరీక్షలకు నిమిషం నిబంధన అమలులో ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. భద్రాద్రి జిల్లాలో ఐదు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, 75 సిట్టింగ్ స్కాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. అత్యవసర సేవల కోసం కొత్తగూడెం కలెక్టరేట్లో కంట్రోల రూం ఏర్పాటైంది. విద్యార్థులు 90302 49339, 08744-241950 నంబర్లను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. పరీక్షా సమయం ముగిసేంత వరకు విద్యార్థులకు బయటకు వెళ్లే అనుమతి ఉండదు.
భద్రాద్రి జిల్లాలో మూడు కేంద్రాల మార్పు..
భద్రాద్రి జిల్లాలోని కేంద్రాల్లో మూడు కేంద్రాలు మార్చాల్సి వచ్చింది. హాల్టిక్కెట్లలో పాతకొత్తగూడెం హైస్కూల్ అని ఉంటే ఎస్పీ కార్యాలయం సమీపంలోని బూడిదగడ్డ హైస్కూల్, చుంచుపల్లి హైస్కూల్ అని ఉంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్న పాఠశాల, ఆనందఖని హైస్కూల్ అని ఉంటే పాతకొత్తగూడెంలోని ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ అని విద్యార్థులు భావించాలి. వివరాలకు 998667 06893, 91542 78988లో సంప్రదించాలి.
సిలబస్ తక్కువ.. చాయిస్ ఎక్కువ..
విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఆన్లైన్లోనే ఎక్కువగా తరగతులు జరగడాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ సిలబస్ తగ్గించింది. ప్రశ్నాపత్రాల్లో చాయిస్ బాగా పెంచింది. ఉదహరణకు గణితశాస్త్ర పరీక్షకు 2 పేపర్లు ఉండేవి. ఇప్పుడు ఒకే పేపర్ అయింది. గతంలో 1 మార్కు ప్రశ్నలు ఏడు ఇచ్చి అన్ని రాయాల్సి ఉండేది. ఇప్పుడు 1 మార్కు ప్రశ్నలను రెండు మార్కులు చేస్తూ 12 ప్రశ్నలు ఇచ్చి 6 ప్రశ్నలను సమాధానాలు రాసేలా చాయిస్ ఉంటుంది. గతంలో 2 మార్కుల ప్రశ్నలు ఆరు ఉంటే ఆరూ రాయాల్సి ఉండేది. ఇప్పుడు వాటిని 4 మార్కుల ప్రశ్నలుగా మార్చి ఎనిమిది ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 4 ప్రశ్నలు సమాధానాలు రాసేలా చాయిస్ ఉంటుంది. గతంలో 4 మార్కుల ప్రశ్నలను 8 మార్కులుగా మార్చి 8 ప్రశ్నలు ఇచ్చి 4 రాసేలా చాయిస్ ఉంటుంది. సాధారణ విద్యార్థులు సగం సిలబస్ చదివినా 90 శాతం మార్కులు సాధించేలా ప్రశ్నాపత్రాలు ఉంటాయి.
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు..
ఉమ్మడి జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. నిఘా నేత్రాలు, చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలోనే ప్రశ్నాపత్రాలు బయటకు తీయాల్సి ఉంది. ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్కాడ్స్ పరీక్షలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికా రులు, ఉభయ జిల్లాల డీఈవోలు పరీక్షల పర్యవేక్షకులు, సిబ్బందితో పరీక్షల నిర్వహణపై చర్చించారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్స్ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు WW.BSE.TELANGANA.GOV.INలో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఖమ్మం నగరంలోని పలు కేంద్రాలను డీఈవో యాదయ్య, అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, అబ్జర్వర్ తనిఖీ చేశారు.
హాల్టిక్కెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్టిక్కెట్ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫీజులు చెల్లించలేని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా హాల్టిక్కెట్లు తీసుకోవచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దు. ఇబ్బందులు ఉంటే కంట్రోల్రూం నంబర్కు ఫిర్యాదు చేయండి. వెంటనే స్పందన వస్తుంది. భయపడవద్దు.
– సోమశేఖరశర్మ, డీఈవో, కొత్తగూడెం