అశ్వారావుపేట, మే 8 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో ఉపాధిహామీ కూలీలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాప్ సర్వర్ పనిచేయడం లేదు. ఫలితంగా కూలీల ముఖహాజరు నమోదు కావడం లేదు. దీంతో కూలీలు పనిచేసినప్పటికీ కూలి డబ్బులు కోల్పోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 22 మండలాలు, 481 గ్రామ పంచాయతీల్లో 2.02 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వీరిలో దాదాపు 50 శాతం మందికి ముఖ హాజరు పడటం లేదు. అధికారులు సైతం యాప్తో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏదేమైనా వలసల నివారణ కోసం ఎంతో గొప్పగా అమలవుతున్న ఉపాధిహామీ పథకం నిర్వీర్యం దిశగా సాగుతుండడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ఎర్రటి ఎండల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు సైతం సర్వర్ కష్టాలు తప్పడం లేదు. ఎండలో పనిచేసి తీరా ఫొటో హాజరు సమయంలో యాప్ సర్వర్ పనిచేయక ఎదురుచూపులు తప్పడం లేదు. వేసవి దృష్ట్యా కూలీలు ఉదయం 7 గంటలకే పని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత పని మొదలు పెట్టే సమయంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ గ్రూపులోని కూలీల ఫొటోతో హాజరు నమోదు చేస్తారు. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. కొందరు కూలీల ఫొటో హాజరు నమోదు కావడం లేదు. దీనికి యాప్ సర్వర్ సమస్యగా ఉపాధి సిబ్బంది చెబుతున్నారు.
వీరు ఉపాధి పనులు చేయకుండానే తిరిగి ఇళ్ళకు వెళ్లిపోతున్నారు. దీంతో ఉపాధి పనులకు కొందరు కూలీలు దూరమవుతున్నారు. ఇక పనులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా కూలీల ముఖ హాజరు నమోదులో సాంకేతిక సమస్యలు కూలీలతోపాటు ఉపాధి సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నది. పనిచేసిన కొందరు కూలీలకు డబ్బులు అందక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించక గ్రామీణ కూలీలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఫలితంగా ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనుల పట్ల ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయ పనులు వెతుక్కుంటున్నారు.
ఉపాధి కూలీలకు ముఖ హాజరు సమస్యతోపాటు కనీస సౌకర్యాలు అందడం లేదు. పని ప్రదేశాల్లో టెంటుతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తాగునీటిని ఇళ్ల నుంచి కూలీలే తెచ్చుకుంటున్నారు. అలాగే వేసవిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు అందుబాటులో ఉండటం లేదు. కూలీలతోపాటు ఉపాధి పనులు చేయిస్తున్న క్షేత్ర సిబ్బందికి మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు.
ఉపాధి పనులకు హాజరవుతున్న కూలీల్లో 50 శాతం మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 22 మండలాలు, 481 గ్రామ పంచాయతీల్లో 1.23 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 2.02 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లోని 50 శాతం అంటే.. సుమారు లక్ష మంది కూలీలు ముఖ హాజరు నమోదుకాక ప్రతిరోజూ గంటలకొద్దీ పడిగాపులు పడాల్సి వస్తుంది. కనీస సౌకర్యాలు లేక, ముఖహాజరు ఇబ్బందులతో ఉపాధి పనులపైనే ఆధారపడ్డ అనేక మంది కూలీలు ఉపాధి పథకం పట్ల ఆసక్తి కోల్పోతున్నారు. పాత పద్ధతిలోనే ఉపాధి పథకం అమలు చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ హాజరు సమస్యను పరిష్కరిస్తున్నాం. మొదట్లో సర్వర్ సమస్య వల్ల కొంత ఇబ్బందిపడ్డాం. ఇప్పుడు చాలావరకు సమస్య పరిష్కారమైంది. ఎక్కడైనా ముఖ హాజరుకాకుంటే ప్రత్యామ్నాయంగా సెల్ ఫొటో తీసి హాజరు నమోదు చేస్తున్నాం.
– రామచంద్రరావు, ఈజీఎస్ ఏపీవో, అశ్వారావుపేట
ఉపాధిహామీ పనులే మా జీవనాధారం. పనికి వచ్చిన తర్వాత ముఖ హాజరు నమోదు కావడం లేదు. ఈ సమస్యతో ఎన్నోసార్లు పని చేయకుండానే ఇంటికి వెళ్లిపోయాను. కొన్నిసార్లు పని పూర్తి అయిన తర్వాత హాజరు నమోదుకాలేదు. దీంతో నాకు రావాల్సిన కూలి డబ్బులు కోల్పోయాను.
– కుర్సం రాములమ్మ, ఉపాధి కూలీ, గుమ్మడవల్లి
ఉపాధిహామీ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలి. లేకపోతే కూలీలు ఉపాధి పనులకు దూరమవుతారు. ముఖ హాజరు నమోదుకాక పనులు కోల్పోతున్నాను. కొన్నిరోజుల ఉపాధి డబ్బులు కూడా రాలేదు. పనికి హాజరైన కూలీలందరికీ కచ్చితంగా డబ్బులు చెల్లించాలి.
– షేక్ ఉర్థండు, ఉపాధి కూలీ, కొత్తూరు