భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మినీ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లుగా పనిచేస్తూ, వాళ్లే వంటావార్పు చేసుకుంటూ తక్కువ వేతనంతో కాలం వెల్లదీస్తున్న అంగన్వాడీ టీచర్ల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 626 కేంద్రాలకు మహర్దశ పట్టింది. అలాగే ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే సర్కార్ వారికి ఉద్యోగోన్నతి కల్పించనున్నది. వేతనం రూ.7,800 నుంచి రూ.13,6 50కు పెరగనున్నది. ఆయాలు, టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెరిగింది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం నుంచి టీచర్కు రూ.లక్ష, ఆయాకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందనున్నది.
కేంద్రాల మార్పు ఇలా..
పదేళ్ల నుంచి కొనసాగుతున్న మినీ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ కుటుంబాలు ఉండడం, కేంద్రాలు రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడంతో టీచర్లకు తల్లులు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కష్టతరమైంది. సాధారణంగా ఒక మినీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఆయా, టీచర్ పోస్టును ఒకరే నిర్వహించాలి. దీంతో కుటుంబాల సంఖ్య పెరుగుతూ వస్తున్న కొద్దీ టీచర్లకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నింటిపై అంగన్ టీచర్ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో సర్కార్ మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని, టీచర్లకు ఉద్యోగోన్నతి కల్పించాలని నిర్ణయించింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
మేం చాలకాలం నుంచి అంగన్వాడీ మినీ కేంద్రాల్లో టీచర్ పని, హెల్పర్ పని రెండూ చేస్తున్నాం. సీఎం కేసీఆర్ మా సమస్యలను అర్థం చేసుకున్నారు. కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తుండడంతో మా కష్టాలు తప్పాయి. ఇంటర్మీడియట్ పూర్తయిన టీచర్లు ఉద్యోగోన్నతి పొందనున్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– బోడా రుక్మిణి, మినీ అంగన్వాడీ టీచర్, హలావత్ తండా, సర్వారం