ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో లక్ష్మీప్రసన్న అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. వైస్ చైర్మన్ కే వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె గడిచిన మూడు నెలలకు సంబంధించి మార్కెట్ ఆదాయ, వ్యవయాలపై సమీక్ష చేశారు. కొద్ది రోజుల్లో మిర్చి పంట మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మార్కెట్కు మిర్చిపంట రానున్నందున అవసరమైన మేర ట్రాలీలు, దడవాయిల సంఖ్య పెంచేందుకు గాను సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మార్కెట్లో బినామీలను అరికట్టేందుకు అర్హత కలిగిన వ్యక్తులకు కమీషన్ లైసెన్స్లు ఇచ్చే విషయంపై సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మిర్చీయార్డు విస్తీర్ణం పెంచేందుకు, పురాతన భవనాలు తొలగిస్తున్న క్రమంలో అగ్నిమాపక కేంద్రంలోకి పరిపాలన వ్యవస్థను మార్చిన విషయాన్ని సభ్యులకు తెలియజేశారు. కూరగాయల మార్కెట్కు షాపుల కిరాయిలు, అగ్రిమెంట్ల రెన్యూవల్ త్వరతగతిన చేపట్టాలన్నారు.
సకాలంలో మార్కెట్ ఫీజు చెల్లించని వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని పాలకవర్గం సభ్యులు మరో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మున్పిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పాలకవర్గం సభ్యులు పత్తిపాక రమేష్, నారపోగు నాగయ్య, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, అజ్మీర వెంకన్న, జంగాల శ్రీనివాస్, షేక్ అప్జల్, నాగండ్ల భద్రయ్య, గ్రేడ్-టూ అధికారి బజార్, అసిస్టెంట్ సెక్రటరీలు డీ నిర్మల, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.