మండు వేసవి రాకముందే తాగునీటి కోసం తండ్లాట షురువైంది. తలాపునే ఉన్న మున్నేరు నీరు లేక ఏడారిని తలపిస్తోంది. చేతిలో బిందె, ప్లాస్టిక్ బకెట్లతో బోర్లు, ట్యాంకుల వద్దకు మహిళల పరుగందుకుంది. ట్యాంకర్ రాగానే నీళ్ల కోసం తాపత్రయం ఆరంభమైంది. చిన్నాపెద్దా తేడా లేకుండా వరుసబెట్టి నీటిని పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో నాలుగు రోజులుగా నల్లాలు రాకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుండగా..
మరికొన్ని డివిజన్లలో నీరు రాక ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చిన్న నీటి సమస్య తలెత్తినా అప్పటికప్పుడే పరిష్కారం లభించేది. నీటి సమస్య తీరేది. కానీ.. ఇప్పుడు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని నగరవాసులు దిగులు చెందుతున్నారు. నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.