తిరుమలాయపాలెం, డిసెంబర్ 28 : రైతులు సాగు విధానంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. మండలంలోని జల్లేపల్లి, పాతర్లపాడు, తాళ్లచెరువు, దమ్మాయిగూడెం ప్రాంతాల్లో గురువారం వేరుశనగ, వరి, పండ్ల తోటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ నూతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అధునాతన పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని సూచించారు.
రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా అనుకూలమైన పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని కోరారు. సాగులో మేలు రకమైన విత్తనాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరి, వేరుశనగ పంటల్లో వివిధ రకాల తెగుళ్లను పరిశీలించిన ఆమె తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో కూసుమంచి ఏడీఏ విజయచంద్ర, వ్యవసాయాధికారి నారెడ్డి సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.