కూసుమంచి, జూన్ 11 : తొలకరి వర్షాలకే తొందరపడి విత్తనాలు వేయొద్దని, అదును వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అన్నారు. నేలపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవని, ఈ తరుణంలో స్వల్పకాలిక పంటలే వేయాలని సూచించారు.
రైతులు లాభసాటి పంటల వైపు దృష్టి సారించాలని, పండ్లు, కూరగాయలు, పామాయిల్ సాగుతోపాటు అంతర పంటలుగా పెసర, మినుము సాగు చేయవచ్చన్నారు. వర్షాలు కాస్త ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నందున నేరుగా వెదజల్లే పద్ధతిలో పంటలు వేసి లాభాలు గడించాలన్నారు. పంట అవశేషాలను తగులబెట్టవద్దని, వాటిని భూమిలోనే కలియదున్నాలని సూచించారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కూసుమంచిలో ఎరువులు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. విత్తన, ఎరువుల స్టాక్ బోర్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ సతీశ్, ఏవో రామడుగు వాణి, ఏఈ ప్రియాంక, నేలపట్ల సర్పంచ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.