Bhadrachalam | భద్రాచలం వద్ద గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలు గడిచినా 53 అడుగులకు పైగానే ప్రవాహం. ఎగువ నుంచి పరుగులు పెడుతూ వస్తున్న వరదతో గోదావరి వద్ద శుక్రవారం రాత్రి కలెక్టర్ ప్రియాంక ఆల మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం రాత్రి 10 గంటల వరకు 56 అడుగులకు నీరు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. పలు మార్గాలకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వైమానిక హెలికాఫ్టర్ ద్వారా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వరద ఉధృతిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చర్ల మండల కేంద్రానికి చేరుకుని పునరావాస కేంద్రాల్లో వరద బాధితులను పరామర్శించారు. స్వయంగా బాధితులకు భోజనం వడ్డించారు. తర్వాత భద్రాచలం చేరుకుని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు.
ఖమ్మం, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. శుక్రవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులకు ప్రవాహం చేరుకోగా భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల నేపథ్యంలో అధికారులు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం ప్రధాన మార్గం, భద్రాచలం- చింతూరు ప్రధాన మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. బూర్గంపహాడ్ మండలంలోని సారపాక- నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్-వేలేరు, ఇరవెండి- అశ్వాపురం రహదారులపైకి గోదావరి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ముంపు ప్రాంతాలకు చెందిన 10 వేల మంది గ్రామస్తులను 10కు పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలో ముంపు ప్రాంతాల్లో చేరిన వరద నీటిని అధికారులు పెద్ద పెద్ద మోటర్ల ద్వారా తిరిగి గోదావరిలోకి మళ్లిస్తున్నారు. వైమానిక హెలికాఫ్టర్ ద్వారా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వరద ఉధృతిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చర్ల మండల కేంద్రానికి చేరుకుని పునరావాస కేంద్రాల్లో వరద బాధితులను పరామర్శించారు. స్వయంగా బాధితులకు భోజనం వడ్డించారు.
అనంతరం భద్రాచలం చేరుకుని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి కరకట్ట ప్రాంతాన్ని సందర్శించారు. సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో ఎయిర్ఫోర్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి అవసరమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. మంత్రి వెంట ప్రత్యేకాధికారి కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, భద్రాద్రి ఎస్పీ వినీత్ ఉన్నారు. బూర్గపహాడ్ మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి సభ్యుడు తాతా మధు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించారు. బూర్గంపహాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.