ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ అన్నింటా అన్యాయమే జరిగింది. ఏళ్లతరబడి పోటీపడి.. పుస్తకాలతో కుస్తీ పట్టి చదివినా నిరుద్యోగ అభ్యర్థులకు కొలువులు దక్కలేదు. వయసు మీదపడుతున్నకొద్దీ ఆందోళన మొదలైంది. ఎంత చదివినా ఇంతేనని.. ఈ కొలువులు మనకు దక్కవని నిర్ధారణకొచ్చిన బిడ్డలెందరో. ఎన్నో పోరాటాలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న స్వరాష్ట్రంలో కొలువుల జాతర వచ్చింది. మన కొలువులు మనకే దక్కాలని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పిన మాటను నిజం చేశారు. వరుసగా వివిధ శాఖల్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేశారు. ఎలాంటి పైరవీలు, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా.. ప్రతిభకే పట్టం కట్టే విధంగా పకడ్బందీగా నియామకాలు చేపట్టారు. ఇందుకు సాధారణ కుటుంబాల నుంచి ఎందరో అభ్యర్థులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించడమే నిదర్శనం. తమ బిడ్డల కష్టానికి తెలంగాణ ప్రభుత్వంలో ఫలితం దక్కిందని ఉద్యోగాలు సాధించిన వారి కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నారు.
ఉద్యోగాల నోటిఫికేషన్లు సకాలంలో రాక.. వచ్చినా వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో నిరుద్యోగులు నరకయాతన పడ్డారు. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాల నియామకాల్లో అవినీతి, డబ్బు, పైరవీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అవన్నీ సంపన్నుల కుటుంబాల పిల్లల వశమయ్యాయనే ఆరోపణలుండేవి. దీంతో ఏళ్లకొద్దీ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు నిరాశే ఎదురయ్యేది. స్వరాష్ట్రంలో కష్టపడి చదివిన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉద్యోగాల నియామకాన్ని పకడ్బందీగా చేపట్టారు. ఖాళీగా ఉన్న శాఖల్లో పోస్టులను భర్తీ చేయడంతోపాటు పారదర్శకంగా నియామకాలు చేపట్టారు. పుస్తకాలతో కుస్తీపట్టిన పేటింటి, సాధారణ కుటుంబాల పిల్లలే ఎక్కువగా ఉద్యోగాలు సాధించారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని వారి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు.
భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం మాది. స్వరాష్ట్రంలో మా ఆశయాలు నెరవేరాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షకు అర్థం చేకూరింది. తెలంగాణ వస్తే మా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎన్నో కలలుగన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్తో మా కలలన్నీ నెరవేరాయి. గ్రామంలో ఇంటి వద్ద చిన్న కిరాణా దుకాణం, అందులోనే ఉదయం పూట అల్పాహారం విక్రయిస్తూ బతుకు వెళ్లదీస్తున్నాం. మా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగ వస్తే ఆర్థికంగా మాకు కొండంత ధైర్యం ఉంటుందని అనుకున్నాం. తెలంగాణ వస్తే తప్పకుండా మా కొడుకు ఉద్యోగం సాధిస్తాడని నమ్మకంతో ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో అధిక ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇదే శాఖలో మా కుమారుడు కూడా నవీన్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. మేం పేదరికంలో ఉన్నప్పటికీ మా కొడుకు చదువుకు ఆటంకం కలుగనీయలేదు. వాడు కూడా మా ఆర్థిక పరిస్థితిని గమనించి పట్టుదలతో చదివాడు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం లైబ్రరీలో ప్రతిరోజూ చదువుకునే వాడు. అక్కడే రూము అద్దెకు తీసుకుని కష్టపడి చదివాడు. రెండో ప్రయత్నంలో రాత పరీక్షలో 110 మార్కులు, ఈవెంట్లలో 70 మార్కులు సాధించి కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు.
మాది అశ్వారావుపేట మం డలం నల్లబాడు గ్రామం. మధ్య తరగతి వాళ్లం. కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ వెంటనే మా చిన్న కుమారుడు బండ్రెడ్డి వీర వెంకట సత్యనారాయణ దరఖాస్తు చేశాడు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ కొలువు సాధించాడు. మా మిగతా ఇద్దరు కుమారులు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మేము పాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. మాకు ఉన్న ఒక్క ఎకరంలో అంతర పంటలు సాగుచేస్తూ పిల్లలను చదివించుకున్నాం. మా చిన్న కుమారుడు వీర వెంకట సత్యనారాయణ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. సొంతంగానే కష్టపడి ఉద్యోగం సాధించాడు. తెలంగాణ సర్కారు వచ్చాకే నా కొడుకు ఉద్యోగం సాధించాడు. పైరవీలు, పైసల ఖర్చు ఏమీ లేవు. మా కుమారుడికి తెలంగాణ సర్కారులో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మా కుటుంబానికి భరోసా కలిగింది.
తెలంగాణ ప్రభుత్వం నాకు మంచి భవిష్యత్తునందించింది. మాది అశ్వారావుపేట పట్టణం. మా అమ్మానాన్న బద్దిరెడ్డి రెడ్డిబాబు, నాగలక్ష్మి. వాళ్లు ఇక్కడ చిన్న హోటల్ నడుపుతూ నన్ను, నా సోదరుడు రాజేశ్ను పోషిస్తున్నారు. ఆర్థిక ఒడిదొడుకుల కారణంగా మధ్యలో నేను చదువు ఆపేశాను. హోటల్లో మా తల్లిదండ్రులకు సాయంగా ఉన్నాను. కానీ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో మళ్లీ చదువును కొనసాగించాను. ఇదే సమయంలో బెటాలియన్ కానిస్టేబుల్ నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే దరఖాస్తు చేసి ఉద్యోగానికి సన్నద్ధమయ్యాను. శిక్షణ కూడా పొందాను. 2018లో జరిగిన రాత పరీక్షకు హాజరయ్యాను. 200 మార్కులకుగాను 121 మార్కులు సాధించాను. దీంతో బెటాలియన్ విభాగంలో కానిస్టేబుల్గా ఉద్యోగం లభించింది. మొదట సత్తుపల్లి బెటాలియన్లో పనిచేసిన నేను.. ప్రస్తుతం కొత్తగూడెం బెటాలియన్లో పనిచేస్తున్నాను. మరింత పట్టుదలతో ఇటీవల అగ్నిమాపక సిబ్బంది నియామకాలకు కూడా దరఖాస్తు చేశాను. పరీక్షలో అర్హత కూడా సాధించాను. కానీ ఎప్పటికైనా ఎస్ఐ కావాలన్నదే నా ఆశయం.
పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు, సోదరుడు నా చిన్నతనం నుంచే చదువు కోసం ఎంతో సహకరించారు. విద్యాభ్యాసానికి సంబంధించి ఎప్పుడు ఏది కావాలన్నా అడిగిందే తడువుగా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా తెచ్చి ఇచ్చేవారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వెన్నుతట్టి ప్రోత్సహించారు. బీటెక్ పూర్తయిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువులో పోటీపడి అనుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగా. చివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించా. ఎలాంటి పైరవీలు లేకుండా సొంత ప్రతిభతోనే ఉద్యోగం సాధించా. సొంతంగా కష్టపడి చదివి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొలువుకు ఎంపికయ్యా.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే 2020 సంవత్సరంలో నా కొడుకు సాయిబాబాకు ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. మా ఊళ్లో భార్యాభర్తలం పాలు అమ్ముకొని జీవిస్తున్నాం. మా కష్టానికి తోడు.. కొడుకు కష్టం తోడయ్యింది. రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడు. కొడుకు ఉద్యోగం కోసం ఎవరికి పైసా లంచం ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినంకనే చదువుకున్న పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగాలు వస్తున్నయి. నా కొడుక్కి ఉద్యోగం రావడంతో అందరం ఆనందంగా జీవిస్తున్నాం.