భద్రాచలం, ఫిబ్రవరి 24: అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. అడవుల సంరక్షణ కోసం ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన సరిహద్దు జిల్లాల అటవీ శాఖ ధికారుల ప్రత్యేక సమావేశం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ఉన్న అటవీ శాఖ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రంజిత్నాయక్ మాట్లాడుతూ.. అక్రమ కలప రవాణా నివారణ కోసం అంతర్ రాష్ట్ర అటవీ సరిహద్దుల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అడవుల్లో అక్రమ పోడు వ్యవసాయం నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీ ఉత్పత్తుల సేకరణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ముఖ్యంగా వేసవి సమీపిస్తున్నందున అడవుల్లో అగ్ని నివారణ చర్యలు చేపట్టాలని, గొత్తి కోయలు అక్రమ చొరబాటును నిరోధించాలని, అడవులు ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
అన్ని రాష్ర్టాల అటవీ అధికారుల మధ్య సహాయ సహకారాలు పెంపొందించుకోవాలన్నారు. అటవీ ఫలసాయం తనిఖీ కేంద్రాలను నిర్మించాలని, అటవీ ఫలసాయం అక్రమ రవాణా మార్గాలను గుర్తించి నిఘాను పటిష్టం చేయాలని అన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాల్లో నోడల్ అధికారులను నియమించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా నుంచి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తేజస్ శేఖర్ (ఐఎఫ్ఎస్), బీజాపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ పాటిల్ (ఐఎఫ్ఎస్), ఒడిశా మల్కనగిరి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కే.ప్రతాప్ (ఐఎఫ్ఎస్), ఆంధ్రప్రదేశ్ చింతూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వీ.సాయిబాబా (ఐఎఫ్ఎస్), భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ బీ.బాబు పాల్గొన్నారు.