సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 1: నియోజకవర్గంలో గత నెల 30న జరిగిన ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని బీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 87 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్ నివాసం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సండ్ర మాట్లాడారు. మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పారు. అయితే, ఒక వైపు పోలింగ్ జరుగుతున్నప్పటికీ సాయంత్రం ఐదున్నర గంటలకే కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయడం ద్వారా ఓటర్లు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ పెద్దలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత 31 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. అయితే, నియోజకవర్గంలో మొదటి నుంచి బోగస్ ప్రచారాలు చేసేవారు ఉన్నారని, వారు తన గెలుపుపై కూడా బోగస్ ప్రచారాలు చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఓటర్లు తనపై నమ్మకంతో తనను గెలిపించేలా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఇలాంటి బోగస్ ప్రచారాలను నమ్మి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలెవరూ మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఇలాంటి బోగస్ ప్రచారాలతో గిట్టనివాళ్లు తాత్కాలిక ఆనందం పొందుతుంటారని, కానీ గెలుపు మాత్రం తనవైపే ఉందని అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా బూత్ల వారీగా పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి మీదట తాను నాలుగోసారి కూడా భారీ మెజార్టీతో గెలుపొందనున్నట్లు తేలిందని అన్నారు.
రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగిన తర్వాత నియోజకవర్గవ్యాప్తంగా జరిపిన సర్వేలో నూటికి నూరుశాతం సత్తుపల్లిలో బీఆర్ఎస్ గెలుపొందనుందని తేలిందన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషిచేసిన పోలీసులకు తాను పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావులతోపాటు వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.