సారపాక, ఆగస్టు 2 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇలాంటి పథకాలే తమకూ కావాలంటూ దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలూ కోరుకుంటున్నారని గుర్తుచేశారు. మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలైతే తమనూ తెలంగాణలో కలపాలంటూ డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇంతటి ఆదరణ ఎంతో గర్వకారణమని అన్నారు. మణుగూరు మండలంలోని గుట్ట మల్లారంలో బుధవారం పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాల వారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు వెల్లువలా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు.