ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 29 : సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)ల నుంచి స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా ఉద్యోగోన్నతి పొందేందుకు నిర్వహిస్తున్న ప్రక్రియలో తొలిరోజు ఆదివారం 321 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు నగరంలోని పాత డీఈవో కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు వివిధ కేటగిరిల్లో ఉద్యోగోన్నతులు పొందేందుకు రోస్టర్ ప్రక్రారం జాబితాను విడుదల చేసి ఎంపిక చేసిన సబ్జెక్ట్లలో అర్హత కలిగిన ఉపాధ్యాయుల చెక్ లిస్ట్ను పరిశీలిస్తున్నారు.
మూడ్రోజులపాటు జరిగే కౌన్సిలింగ్లో భాగంగా సీనియర్ పీజీ హెచ్ఎంలు 12మందితో బృందాలను ఏర్పాటు చేశారు. 12 కౌంటర్లలో ఉద్యోగోన్నతి పొందే ఉపాధ్యాయుల చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతోపాటు సర్వీస్ రిజిష్టర్(ఎస్ఆర్), కుల, స్పెషల్ కేటగిరికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆదివారం జరిగిన కౌన్సిలింగ్లో లోకల్బాడీ పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలు-295 పరిశీలనకు హాజరుకాగా, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలు-26మంది హాజరయ్యారు. ఉద్యోగోన్నతులకు సంబంధించిన అభ్యంతరాలపై 135మంది ఉపాధ్యాయులు అప్పీళ్లు అందజేశారు. అప్పీళ్లపై పరిశీలన చేసి అవకాశం ఇస్తారు. కౌన్సిలింగ్ ప్రక్రియను డీఈవో సోమశేఖరశర్మ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వరచారి, సూపరింటెండెంట్లు చావా శ్రీనివాసరావు, శ్రీధర్బాబు, నరుకుళ్ళ శ్రీనివాసరావు, వజ్జా కిశోర్కుమార్, సీనియర్ అసిస్టెంట్లు జీఎస్ ప్రసాదరావు, నందకిశోర్, దేవేందర్ కుమార్, యర్రమల శ్రీనివాసరావు, బోనగిరి నగేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల బదిలీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా సోమవారం అర్ధరాత్రితో ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ముగియనున్నది. తొలిరోజు సుమారు 900మంది పైచిలుకు దరఖాస్తు చేసుకోగా, రెండోరోజు ఆదివారం సెలవు కావడంతో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 2,240 పైచిలుకు బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. చాలామంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సబ్మిట్ మాత్రం కొట్టకుండా ఆగినట్లు తెలుస్తున్నది. కొందరు ఉపాధ్యాయులు మెడికల్కు సంబంధించిన, కేటగిరిలకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా పొందుపర్చాల్సి రావడంతో వీటిన్నింటిని పొందుపరిచి సోమవారం సబ్మిట్ కొట్టనున్నారు. 2023 ఫిబ్రవరి 1 నాటికి కనీసం రెండు సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారు బదిలీ దరఖాస్తు అర్హుల కాగా, హెచ్ఎం 5 సంవత్సరాలు, మిగిలిన ఉపాధ్యాయులు 8 సంవత్సరాలు పూర్తైన వారు తప్పనిసరి బదిలీ కానున్నారు.