కూలీలు, పేదలకు ఉచితంగా ‘అన్నపూర్ణ’ భోజనం
మంత్రి ఆదేశంతో ఇళ్ల వద్దకే వెళ్లి వడ్డిస్తున్న మెప్మా సిబ్బంది
ఖమ్మం, మే 29: రోజువారీ కూలి పనుల కోసం నగరాలు, పట్టణాలకు వచ్చే కూలీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 అన్నపూర్ణ భోజనం పథకం లాక్డౌన్లోనూ పేదల ఆకలి తీరుస్తోంది. ఇదివరకు రూ.5గా ఈ భోజనం ఇప్పుడు ఉచితంగా లభిస్తోంది. ఖమ్మంలో పేదలు, కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూడు రూట్లుగా విభజించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోజుకు 1500 మందికి ఈ భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. మెప్మా ఆర్పీలు పేదల ఇళ్లకు వెళ్లి వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.
కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుండడం, అనేక మంది దాని బారిన పడుతుండడం వంటి కారణాలతో ఈ నెల 12 నుంచి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో దినసరి కూలీలు, ఇళ్లలో పనిచేసుకునేవారు, అభాగ్యులు ఆకలికి ఆలమటించి పోతున్నారు. వీరందనీ ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. రెండేళ్లుగా ఖమ్మం నగరంలో మూడు చోట్ల రూ.5కే భోజనం అందిస్తోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. లాక్డౌన్ అమలవుతున్నా సరే.. పేదల ఆకలి తీర్చేందుకు ఈ పథకం కొనసాగుతూనే ఉంది.
రోజూ 1500 మందికి..
నగరంలోని పలు ప్రాంతాల్లో నివసించే కూలీలకు మెప్మా సిబ్బంది ఉచిత భోజనం అందిస్తున్నారు. జూబ్లీపుర, రామన్నపేట, దానవాయిగూడెం, మామిళ్లగూడెం, ఎన్ఎస్టీ రోడ్డు ప్రాంతాలను ఒకటో రూట్గా, సుందరయ్యనగర్, అయ్యప్పస్వామి టెంపుల్, శ్రీనివాసనగర్, గాంధీనగర్, బొక్కలగడ్డ, బీకే బజార్ ప్రాంతాలను రెండో రూట్గా, కైకొండాయిగూడెం, గోపాలపురం, టేకులపల్లి, మమత కళాశాల రోడ్డు ప్రాంతాలను మూడో రూట్గా విభజించి ఆయా రూట్ల మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లను ఇన్చార్జులుగా నియమించి ఆర్పీల ద్వారా పేదలకు భోజనం అందిస్తున్నారు. ఈ మూడు రూట్లలో కలిపి రోజుకు 1500 మంది పేదలకు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నారు.
ఏ ఒక్కరూ ఆకలితో ఉండొద్దన్నదే మంత్రి ఆశయం
లాక్డౌన్ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్నదే మంత్రి అజయ్ ఆశయం. అందుకే ప్రతి రోజూ 1500 మందికి ఉచితంగా భోజనాలు అందిస్తున్నారు. నగరంలోని శివారు ప్రాంతాల్లో పేదలు ఎక్కువగా ఉన్న ఏరియాలను గుర్తించి అక్కడికే వెళ్లి భోజనాలు పెడుతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్పై ఆర్థిక భారం పడినా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.
-పునుకొల్లు నీరజ, మేయర్