ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి దళితబంధు పథకం అమలు కోసం రూ.100 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీనిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, సీఎంకు దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన నాలుగు మండలాల్లో చింతకాని మండలాన్ని సీఎం కేసీఆర్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దళితుల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ దళితబంధు పథకం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ.100కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలానికి, రూ.50కోట్లు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగోండ మండలానికి, రూ.50కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.