హాజరుకానున్న ప్రథమ సంవత్సర విద్యార్థులు
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..
పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలు
కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 24: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 25వ తేదీ సోమవారం నుంచి జరగనున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ సులోచనారాణి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మొత్తం 34 కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. 9గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతిలేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 8,1 19 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 2,738 మంది వృత్తి విద్యాకోర్సు విద్యార్థులు కలిపి మొత్తం 10,857 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా, గాలి, వెలుతురు సమృద్దిగా ప్రసరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల కన్వీనర్గా సులోచనారాణి వ్యవహరించనున్నారు.
పరీక్షా కేంద్రాలు ఇవే..
కొత్తగూడెంలో… ప్రభుత్వ జూనియర్ కళాశాల, కృష్ణవేణి జూనియర్ కాలేజీ(లక్ష్మీదేవిపల్లి), త్రివేణి జూనియర్ కాలేజీ(లక్ష్మీదేవిపల్లి), శ్రీనలంద జూనియర్ కాలేజీ(లక్ష్మీదేవిపల్లి), సింగరేణి మహిళా జూనియర్ కళాశాల(కొత్తగూడెం), జేవీఎస్ చైతన్య జూనియర్ కళాశాల(లక్ష్మీదేవిపల్లి), సింగరేణి ఉన్నత పాఠశాల (కొత్తగూడెం). భద్రాచలంలో… ప్రభుత్వ జూనియర్ కళాశాల(భద్రాచలం), లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల (భద్రాచలం), త్రివేణి జూనియర్ కళాశాల, టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(దమ్మపేట). పాల్వంచలో… టీఎస్ఎస్ఈబీ ప్రభుత్వ జూనియర్ కళాశాల(పాల్వంచ), కృష్ణవేణి జూనియర్ కళాశాల(పాల్వంచ), కేఎల్ఆర్ జూనియర్ కాలేజీ, టీఎస్ఎస్డబ్ల్యూఆర్ కాలేజీ(బాలురు – పాల్వంచ). మణుగూరులో… ప్రభుత్వ జూనియర్ కళాశాల, కృష్ణవేణి జూనియర్ కళాశాల. ఇల్లెందులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య జూనియర్ కళాశాల, సాహితి జూనియర్ కాలేజీ, టీఎస్టీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ. అశ్వారావుపేటలో.. ప్రభుత్వ జూనియర్ కళాశాల, వీకేడీవీఎస్ రాజు జూనియర్ కాలేజీ, టీఎంఆర్జేసీ జూనియర్ కాలేజీ. చర్లలో.. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బూర్గంపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పినపాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుండాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీఎస్టీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ, టేకులపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, దుమ్ముగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ములకలపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జూలూరుపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా నోడల్ ఆఫీసర్ సులోచనారాణి
సోమవారం నుంచి జరగనున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచనారాణి అన్నారు. ఆదివారం పరీక్షల నిర్వహణ అధికారులు, డీఈసీ మెంబర్లు, ఫ్లైయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్తో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 2 ఫ్లైయింగ్ స్కాడ్స్, 3 సిట్టింగ్ స్కాడ్స్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటాయని, పరీక్షా సెంటర్లలో మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.