చర్ల, మే 7 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కేసీఆర్ను తిడుతూ.. దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలను మభ్యపెట్టడమే పనిగా పెట్టుకున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దుయ్యబట్టారు. మంగళవారం చర్లలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే ఓటు ద్వారా కాంగ్రెస్కు బుద్ధి చెబుతారన్నారు. రేవంత్ సభలకు జనం రావడం లేదంటే కాంగ్రెస్పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోలకు విశేష స్పందన వస్తోందని, ఆయనకు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. జిల్లా మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని, ఇలాంటి వారు ప్రజలకు ఏం సేవలందిస్తారని రేగా ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సోయం రాజారావు, ఎంపీపీ గీద కోదండరామయ్య, సమన్వయ కమిటీ సభ్యుడు దొడ్డి తాతారావు, సీనియర్ నాయకుడు అజీజ్, చింతా నాగుబాబు, ఇరసవడ్ల రాము, కాకి అనిల్, సోయం కృష్ణవేణి, బీరబోయిన జయమ్మ, పోలూరి సుజాత, సీతాపతిరాజు, ముమ్మనేని అరవింద్ తదితరులు పాల్గొన్నారు