రఘునాథపాలెం, మే 7 : కాంగ్రెస్ 100 రోజుల పాలనలో నీళ్లు లేక పంటలు ఎండినయ్.. కరెంటు లేక కారుచీకట్లు కమ్మినయ్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం రఘునాథపాలెం మండలంలోని కోటపాడు, కోయచలక, రేగులచలక గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి ఓటు అభ్యర్థించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మారని, ఈ ఏడాది లక్షల ఎకరాల రైతులకు నీళ్లియ్యక పంటలను ఎండిపెట్టినారని ఆవేదన చెందారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు పోతుందో.. మళ్లీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి అన్నారు. గత 10ఏళ్లలో ఇలాంటి దుర్భర పరిస్థితిని ఎప్పుడైనా చూశారా..?
అని ఈ సందర్భంగా ప్రజలను అడిగారు. దీనిపై ఉపాధి కూలీలు లేదు అంటూ సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ గెలుపు అనివార్యం కావాలన్నారు. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యధిక సీట్లిస్తే కేంద్రంతో పోరాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. గడిచిన వందరోజుల్లో కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత వాగ్దానాలతోనే గడిపిందన్నారు. ఇకపై చేస్తుందనే నమ్మకమూ ప్రజలకు లేకపోయిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, బీఆర్ఎస్ నాయకులు మద్దినేని వెంకటరమణ, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు మాదంశెట్టి హరిప్రసాద్, వైస్ ఎంపీపీ గుత్తా రవి, కుతుంబాక నరేశ్, దొంతు సత్యనారాయణ, కుతుంబాక నరేశ్, నున్నా శ్రీనివాసరావు, శివయ్య పాల్గొన్నారు.