భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : గత ఏడాది పత్తి పంటపై లాభాలు ఆర్జించిన రైతన్నలు ఈ ఏడాది సాగును గణనీయంగా పెంచారు. లక్ష్యానికి మించి పత్తిని వేశారు. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తికి మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతన్నలు పత్తిపైన కోటి ఆశలు పెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,00,525 ఎకరాల్లో పత్తిపంటను సాగు చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పంటల సాగుకు వాతావరణం.. అనుకూలమైన నీరు పుష్కలంగా అందుతున్నది. వరి, పత్తిని ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేయడంతో దిగుబడి అదేస్థాయిలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే వారంకల్లా కొన్ని ఏరియాల్లో పత్తి తీతకు రానుండడంతో సీసీఐ ముందుగానే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ నెల చివరికల్లా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్, వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ ఏడాది మంచి వర్షాలు కురవడంతో పత్తి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 1,22,224 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 144 శాతంపైగా పత్తి పంటను రైతులు సాగు చేయగా.. అదేస్థాయిలో దిగుబడి రానున్నది. జిల్లాలో 1,39,598 ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించగా.. అంతకుమించి 2,00,525 ఎకరాల్లో పంటను సాగు చేసి రైతులు రికార్డు సృష్టించారు. గత ఏడాది కూడా పత్తిపంటకు డిమాండ్ ఉండడం, ఈ ఏడాది అదునుకు వర్షాలు కురవడంతో రైతులందరూ పత్తి పంటపైనే ఆశలు పెట్టుకున్నారు.
పత్తి పంటను విక్రయించే రైతుల పేర్లు ఆన్లైన్ చేస్తారు. ప్రతి రైతు ఆధార్ నెంబర్తో బ్యాంకు ఖాతా నెంబర్ ఇవ్వడంతోపాటు వేలిముద్రలను ప్రామాణికంగా తీసుకుంటారు. దీనివల్ల ఎవరి పంటను వారే విక్రయాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం మార్కెటింగ్ శాఖ నిబంధనలను ఖరారు చేసింది. విక్రయించిన పత్తి సొమ్ములు ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
పత్తిపంట విక్రయాలకు రైతన్నలకు ఎలాంటి లోటు లేకుండా అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిన్నింగ్ కాటన్ మిల్లుల వద్ద సంబంధిత యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. జిల్లాలో మంజిత్ కాటన్ మిల్లు సుజాతనగర్, శ్రీలక్ష్మీ కాటన్ మిల్లు కారేపల్లి, శ్రీరామ కాటన్ మిల్లు అశ్వాపురం, అనుశ్రీ ఇండస్ట్రీస్ లక్ష్మీపురం ఏరియాల్లో రైతులకు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే రైతులకు ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. విక్రయాలు జరుపుకునేందుకు పంటల వద్దనే తేమ శాతం తెలిపే యంత్రాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పత్తి కూపన్లు కూడా ఇస్తున్నారు. పత్తి పంటకు ప్రభుత్వం మద్దతు ధర రూ.7,020 ప్రకటించింది.
ఈ ఏడాది పత్తి పంట బాగా వేశారు. అంచనాలకు మించి పత్తి సాగు అయ్యింది. ఇందుకోసం సీసీఐ నాలుగు చోట్ల కేంద్రాలను అందుబాటులో ఉంచింది. దళారులను నమ్మి మోసపోవద్దు. రైతులు తమ ఆధార్ నెంబర్ను ఎన్రోల్ చేసుకుని విక్రయాలు చేసుకోవాలి. ప్రభుత్వం గిట్టుబాటు ధరను రూ.7,020గా ప్రకటించింది. బ్యాంకు ఖాతాను ఆధార్ లింకుతో జమ చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.