కొణిజర్ల, మే16 : ప్రస్తుత జోనల్ విధానంతో ఖమ్మం జిల్లా వాసులకు రానున్న పోటీ పరీక్షల్లో 5600 మందికి (95శాతం) ఉద్యోగాలు భర్తీ కానున్నాయని, వైరా నియోజకవర్గంలో త్వరలో 2 వేల మందికి దళితబంధు, 3 వేల మందికి డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు కానున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. మండల కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. మండలంలోని సమస్యలు తెలుసుకునేందుకు సమావేశాలు దోహదపడతాయన్నారు. ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉన్నదన్నారు.
ప్రభుత్వ అధికారులు సైతం నిష్పక్షపాతంగా పనిచేసి ప్రజానీకానికి సేవలు అందించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి అందుతాయన్నారు. మండల ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా ప్రజాసమస్యల విషయమై తనను సంప్రదిస్తే తన శక్తి మేర చేయూతనందిస్తానన్నారు. తొలుత వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీకు పూలమొక్క అందజేయగా కాంగ్రెస్ సభ్యులు శాలువా, పూలమాలతో స్వాగతం పలికారు. ఎంపీపీ గోసు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ పోట్ల కవిత, వైస్ఎంపీపీ డేరంగుల వెంకటరమణ, ఎంపీడీవో ఆర్.రమాదేవి, సహకార సంఘం అధ్యక్షుడు చెరుకుమల్లి రవి, ప్రజాప్రతినిధులు సూరంపల్లి రామారావు, బానోత్ బాలాజీ, బానోత్ పద్మ, మాన్సింగ్, దొడ్డపునేని జ్యోతి, షేక్ మౌలానా, అనుమోలు కృష్ణార్జునరావు, బూరా ప్రసాద్, బానోత్ అనూష, దొడ్డపునేని నాగమణి, వడ్డే రమాదేవి, ఏవో బాలాజీ, ఎంఈవో శ్యాంసన్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్నాయక్, ఎంబీ ఏఈ సతీశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.