భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 21 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాపై పోలీస్ శాఖ డేగకన్ను వేసి ఉంచింది. ఇటు ఎన్నికల వేడి, అటు మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ రోహిత్రాజ్ యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,095 పోలింగ్ కేంద్రాలుండగా వాటిల్లో 143 కేంద్రాలను క్రిటికల్ పోలింగ్ సెంటర్లుగా గుర్తించారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో అసిస్టెంట్ ఎన్నికల అధికారులను నియమించారు. ఆయా విభాగాల అధికారులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ అధికారులు ఇప్పటికే 12 అంతర్ రాష్ట్ర, 10 అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా అంతటా నిఘాను ముమ్మరం చేశారు. ఎన్నికల్లో వినియోగించడం కోసం అమాయకులతో డబ్బు తరలింపు ప్రక్రియను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా పరిమితికి మించి తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 1,095 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 15 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. మరో 128 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాయి. ఇందుకోసం 14 ఫ్లయింగ్ స్కాడ్లను కూడా నియమించారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2,500 మంది సిబ్బందిని కేటాయించారు.
ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు ఐదుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ప్రియాంక నియమించారు. భద్రాచలానికి ఆర్డీవో దామోదర్, అశ్వారావుపేటకు అదనపు కలెక్టర్ వేణగోపాల్, ఇల్లెందుకు ఎస్డీసీ కాశయ్య, పినపాకకు ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్, కొత్తగూడేనికి ఆర్డీవో మధు నియమితులయ్యారు. వారితోపాటు నోడల్ అధికారులను కూడా నియమించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, లేక రాజకీయ పార్టీల నాయకులపై అభ్యంతరాలు ఉన్నా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా ప్రజలు 1950 నంబరు ద్వారా కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే ఏర్పాట్లు చేశారు. సీ విజల్ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఓటు వేసే విధానంపైనా, ఫిర్యాదు చేసే విధానంపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఒకవైపు ఎన్నికల వేడి మొదలైన వేళ మరోవైపు మావోయిస్టుల అలజడి నెలకొంటోంది. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేయడం, ఎన్కౌంటర్లు జరుగుతుండడం వంటి కారణాలతో సరిహద్దు ప్రాంతాల పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. కూంబింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాం. అన్ని చెక్పోస్టుల వద్ద కూడా 24 గంటలూ గస్తీ ఏర్పాటుచేశాం. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం, నగదు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నాం. సరైన పత్రాలు లేకుండా పరిమితికి మించి నగదు తరలిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటున్నాం. -రోహిత్రాజు, ఎస్పీ, భద్రాద్రి జిల్లా