నేరస్తులకు శిక్ష పడేలా
చేయడమే లక్ష్యంగా పనిచేయాలి
నేర సమీక్షా సమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్దత్
కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 13: తప్పు చేసిన నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని భద్రాద్రి ఎస్పీ సునీల్దత్ సూచించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఏఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో అధికారులు న్యాయాధికారులతో సమన్వయం పాటి స్తూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ (పోక్సో) కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా అన్ని రకాల ఆధారాలనూ సేకరించి కోర్టుల్లో సమర్పించాలని సూచించారు. కొత్తకొత్త మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజల నగదును దోచుకోవడానికి యత్నిస్తున్నందున జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన బాధితులు ఆలస్యం చేయకుండా ‘డయల్ 100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే విధంగా వారిని అప్రమత్తం చేయాలన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గుట్కా, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘5ఎస్’ అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అన్ని రకాల కేసులకు సంబంధించిన ఫైళ్లను క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. ఏఎస్పీలు శబరీష్, వినీత్, అదనపు ఎస్పీ కేఆర్కే ప్రసాద్, డీఎస్పీలు గుడ్ల వెంకటేశ్వరబాబు, రవీందర్రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సీఐలు, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.