ఖమ్మం, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిల భవనాలు, తలుపుల్లేని బాత్రూంలు, కిటికీల్లేని తరగతి గదులు, పెచ్చులూడే పైకప్పులు.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు చాక్పీసులైనా లేని పరిస్థితులను నాడు మనందరం చూశాం. చిన్న చిన్న మరమ్మతులకు కూడా యాజమాన్యాలు ఆ ఊరి సర్పంచ్లు, దాతల సాయం కోరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ఉపాధ్యాయులే ముందుకు వచ్చి సొంత నిధులతో బడిలో పిల్లలకు మౌలిక వసతులు కల్పించారు.. అయితే.. ఇదంతా ఒకప్పుడు..! కానీ సీఎం కేసీఆర్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ఇప్పటికే మొదటి విడత ‘మన ఊరు- మన బడి’కి ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చివరి దశకు వచ్చాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బడుల నిర్వహణకు సమగ్రశిక్ష అభియాన్ ద్వారా నిర్వహణ నిధులు విడుదల చేశారు. ఇప్పటికే యాజమాన్య కమిటీల బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ అయింది.
జిల్లాలో ప్రభుత్వ 1,176 పాఠశాలలకు..
జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో 1,206 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో గత విద్యాసంవత్సరంలో 85 వేల మంది చదివారు. ప్రభుత్వం సర్కార్ బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి తల్లిదండ్రులు సంతృప్తి చెంది తమ పిల్లలను ఇటీవల సర్కార్ బడుల్లో చేర్పించారు. కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 6 వేల మంది. మొత్తం స్కూళ్లలో ఇప్పటివరకు 1,176 పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతాల్లో నిర్వహణ నిధులు జమయ్యాయి. మరో 30 స్కూళ్లకు సాంకేతిక కారణాలతో నిధులు నిలిచిపోయాయి. త్వరలో ఆయా యాజమాన్యాలకూ నిధులు అందనున్నాయి.
నిధుల విడుదల హర్షణీయం..
గతంలో నిర్వహణ నిధుల విడుదల ఆలస్యమయ్యేది. దీంతో యాజమాన్యం స్టేషనరీ సమకూర్చడం కష్టతరంగా ఉండేది. కొన్నిసార్లు ప్రధానోపాధ్యాయులే సొంత నిధులతో వసతులు కల్పించేవారు. నిధులు ఎప్పుడొస్తాయా.. అని ఎదురుచూసేవారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఈ కష్టాలన్నీ చూసి ఆ బాధ్యతల నుంచి ఎలా తప్పుకోవాలా.. అని ఆలోచించేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం హర్షణీయం.
– పోటు శ్రీను, ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొదుమూరు
పాఠశాల నిర్వహణకు..
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం రూ.1.83 కోట్లు జమ చేసింది. సొమ్ము ఈ విద్యాసంవత్సరం విడుదల కావాల్సిన నిధుల్లో సగానికి పైగానే ఉంటుందని యాజమాన్యాలు తెలిపాయి. నిధులతో యాజమాన్యాలు మెయింటెనెన్స్, కంప్యూటర్ సర్వీసింగ్, పుస్తకాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, స్టేషనరీ, క్రీడాసామగ్రి కొనుగోలుకు వినియోగించుకోనున్నాయి. వాటికి వినియోగించే ప్రతి పైసాను పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం చేయాల్సిందే. నిధుల వినియోగంపై యాజమాన్యాలు డీఈవో కార్యాలయానికి నివేదికలు అందించాల్సిందే.